లక్నో : కొవిడ్-19తో బాధపడుతున్న యూపీలోని ఘజియాబాద్ కు చెందిన స్నేహితుడి కోసం ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు జార్ఖండ్ లోని రాంచీకి చెందిన వ్యక్తి 24 గంటల్లో ఏకంగా 1300 కిలోమీటర్లు తిరిగాడు. ఈనెల 24న దేవేందర్ కుమార్ శర్మకు అతడి స్నేహితుడు సంజయ్ సక్సేనా నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమ ఫ్రెండ్ రాజన్ కు కరోనా సోకిందని, అతడికి తక్షణమే ఆక్సిజన్ అవసరమని సక్సేనా దేవేంద్రకు సమాచారం అందించాడు. రాజన్ కు ఆక్సిజన్ సరఫరా కేవలం 24 గంటలే సరిపోతుందని, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఆక్సిజన్ కు తీవ్ర కొరత ఉందనే విషయం తెలిపాడు. ఇక అదేరోజు రాత్రి దేవేంద్ర తన బైక్ పై బొకారోకు బయలుదేరాడు.
150 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం బొకారో చేరుకున్నాడు. అక్కడ ఆక్సిజన్ సిలిండర్ల కోసం గాలించి జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ యజమాని, తమకు పరిచయమైన రాకేష్ కుమార్ గుప్తాను దేవేంద్ర సంప్రదించాడు. రాకేష్ ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చడమే కాకుండా ముందు ఫ్రెండ్ ప్రాణం కాపాడుకోవడం ముఖ్యమని డబ్బులు కూడా తీసుకోలేదు. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని 1300 కిలోమీటర్ల దూరంలోని ఘజియాబాద్ కు ప్రయాణించి సకాలంలో చేరుకున్నాడు. తన స్నేహితుడి కారులో ప్రయాణించి 24 గంటల్లో ఘజియాబాద్ కు చేరుకున్నాడు. దారిలో ఆక్సిజన్ సిలిండర్ల గురించి ప్రశ్నించగా చావుబతుకుల మధ్య పోరాడుతున్న స్నేహితుడి కోసం వీటిని తీసుకువెళుతున్నట్టు దేవేంద్ర చెప్పుకొచ్చాడు. మొత్తానికి సకాలంలో స్నేహితుడి కోసం అడ్డంకులు అధిగమించి ఆక్సిజన్ ను తీసుకువెళ్లి అతడి ప్రాణాలను నిలబెట్టిన దేవేంద్రను పలువురు ప్రశంసించారు.