రాంచీ : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు చెల్లించాల్సిన రూ 1.36 లక్షల కోట్ల దీర్ఘకాలిక మైనింగ్ బకాయిలను సత్వరమే చెల్లించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చెల్లింపుల విషయంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి లేఖ రాశానని సోరెన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు చేపట్టిన మైనింగ్కు సంబంధించి రూ 1.36 లక్షల కోట్లు దీర్ఘకాలంగా బకాయిలుగా పేరుకుపోయాయని చెప్పారు.
పలుమార్లు బకాయిల చెల్లింపుపై సంప్రదింపులు జరిపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జార్ఖండ్లో సామాజికార్ధికాభివృద్ధి ఈ ఖనిజాల నుంచి వచ్చే రాబడిపైనే ఆధారపడిఉందని సోరెన్ ట్వీట్ చేశారు. జార్ఖండ్లో అధికంగా కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) సబ్సిడరీనే మైనింగ్ చేపడుతోందని అన్నారు.
ఇక శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో సోరెన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ బకాయిలు చెల్లించనిపక్షంలో బొగ్గు గనులను మూసివేస్తామని హెచ్చరించారు. బొగ్గు కంపెనీల నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ 1.36 లక్షల కోట్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని ఈ డబ్బు చట్టబద్ధంగా తమకు రావాల్సినదని సీఎం స్పష్టం చేశారు. బకాయిలను కేంద్రం చెల్లించనిపక్షంలో బొగ్గు గనుల చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించారు.