రాంచి: అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేడు మరోసారి అధికారపక్ష ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. సీఎంగా తనకు తానే మైనింగ్ లీజు కేటాయించుకున్నట్లు సోరెన్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ప్రతిపక్ష బీజేపీ.. గవర్నర్ రమేశ్ బాయిస్కు ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదును రమేశ్ బాయిస్ కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపారు. బీజేపీ ఫిర్యాదు ఆధారంగా ఎంక్వయిరీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. తన సిఫార్సును గత గురువారం సీల్డ్ కవర్లో గవర్నర్కు సమర్పించింది. సోరెన్ ఎమ్మెల్యే పదవిపై వేటు వేయాలని ఆ సిఫారసులో పేర్కొన్నది. దానిపై గవర్నర్ రమేశ్ బాయిస్ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
ఈ నేపథ్యంలో శుక్రవారమే హేమంత్ సోరెన్ అధికారపక్ష ఎమ్మెల్యేలతో రెండు సార్లు సమావేశమయ్యారు. తనపై అనర్హత వేటు పడినా.. సంకీర్ణ సర్కారు కూలిపోకుండా వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో మిత్రపక్షం కాంగ్రెస్.. అధికార జేఎంఎంకు మద్దతు పలికింది. అయితే గవర్నర్ నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉండటంతో ఇవాళ మరోసారి సోరెన్ నివాసంలో అధికార పక్ష ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నారు.