రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్పై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సిఫారసు చేసిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి పట్ల గవర్నర్ ఏవిధమైన నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈనేపథ్యంలో సీఎం సోరెన్ నేడు అధికారపక్ష ఎమ్మెల్యేలతో సమావేశమవనున్నారు. రాంచీలోని తన నివాసంలో జరుగనున్న ఈసమావేశానికి జేఎంఎంతోపాటు అధికార కూటమిలోని యూపీఏ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ సిఫారసుపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉన్నది.
కాగా, సీఎం సోరెన్ మైనింగ్ లీజు వ్యవహరంలో స్వీయ లాభం పొందారని.. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ రమేశ్ బాయిస్కు సూచించినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రాజ్భవన్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 192 ప్రకారం.. చట్టసభకు ఎన్నికైన ప్రతినిధిపై అనర్హత వేటు నిర్ణయం అంతిమంగా గవర్నరే తీసుకోవాలి. దీంతో బాయిస్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
అనర్హతవేటు నిర్ణయంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని సొరేన్ తెలిపారు. తనపై అనర్హత వేటుకు ఈసీ సిఫారసు చేసిందంటూ బీజేపీ నేతలు చెబుతుండటంపై సోరెన్ మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచారం ఉన్న నివేదికను కమలదళం నేతలే సొంతంగా రూపొందించి ఉంటారని ఎద్దేవా చేశారు. ‘అనర్హత విషయంపై రాజ్భవన్ నుంచి గానీ, ఎన్నికల సంఘం నుంచి గానీ సీఎంవోకు ఎలాంటి సమాచారం అందలేదు. ఓ బీజేపీ ఎంపీ, ఆయన చేతిలో కీలుబొమ్మల్లా ఉండే విలేకర్లు కొందరు ఓ తప్పుడు నివేదికను రూపొందించి అసత్య ప్రచారాన్ని చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ‘ఈసీ సీల్డ్ కవర్లో రాజ్భవన్కు పంపిన నివేదికలో ఉన్న విషయం బయటకు ఎలా తెలుస్తుంది?’ అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను, ప్రభుత్వ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నదని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సిగ్గుమాలిన చర్యను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కొనుగలరేమోగానీ, ప్రజా మద్దతుని కాదని మోదీ సర్కారుకు చురకలు అంటించారు. ప్రజల మద్దతే తనకు అఖండ బలమని పేర్కొన్నారు. ఒక వేళ అనర్హత వేటు పడితే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు జేఎఎం తెలిపింది.
తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. అయితే, తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని కాంగ్రెస్ నేత, మంత్రి అలంగిరీ ఆలమ్ ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సొరేన్పై అనర్హత వేటు పడినప్పటికీ, ప్రభుత్వానికి వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు.
స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరేన్ పొందారంటూ గవర్నర్ రమేశ్ బాయిస్కు బీజేపీ ఫిర్యాదు చేసింది. గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న సొరేన్ తనకోసం తానే ఒక లీజు మంజూరు చేసుకోవడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పార్టీ నేత, మాజీ సీఎం రఘుబర్దాస్ ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 9ఏ ప్రకారం సొరేన్పై అనర్హత వేటు వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) గవర్నర్ కోరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం సీల్డ్ కవర్లో తన అభిప్రాయాన్ని ఈసీ.. రాజ్భవన్కు పంపించింది.