రాంచీ : జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం లేదని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రవీంద్ర నాధ్ మహతో స్పష్టం చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో అసంపూర్తిగా మిగిలిన కార్యకలాపాలను పూర్తి చేసేందుకు సెప్టెంబర్ 5న ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.
పార్టీల సంఖ్యాబలం ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని, పెండింగ్ బిజినెస్ను పూర్తిచేసేందుకే ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశామని మహతో పేర్కొన్నారు. జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం నెలకొనలేదని తేల్చిచెప్పారు. కాగా, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నేపధ్యంలో సెప్టెంబర్ 5న ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలనే ప్రతిపాదనను గురువారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది.
ఇక ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ శాసనసభ్యత్వం రద్దు నేపధ్యంలో యూపీఏ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ రమేష్ బయాస్ను కలిసి గురువారం మెమొరాండం సమర్పించిన సంగతి తెలిసిందే. మరోవైపు జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు పాలక పక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందనే అనుమానంతో గత మంగళవారం 32మంది శాసనసభ్యులను కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్కు తరలించారు.