న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: జేఈఈ మెయిన్ నాలుగు సెషన్ల పరీక్షలు ముగిశాయి. చివరి సెషన్ ఆన్సర్ కీని ఎన్టీఏ ఇప్పటికే విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో మెయిన్ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల కావొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటే నాలుగు ఎడిషన్లకు కలిపి మెరిట్ లిస్టు విడుదల అవుతుంది. ఈ మెరిట్ లిస్టు ఆధారంగానే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు విద్యార్థులు అర్హులవుతారు. జేఈఈ మెయిన్లో 2.5 లక్షల వరకు ర్యాంకు సాధించినవారు అడ్వాన్స్డ్కు అర్హత సాధిస్తారు. ఈ సారి జేఈఈ మెయిన్ కటాఫ్ 90 పర్సంటైల్ పైనే ఉండొచ్చని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు పరీక్ష రాసే అవకాశాలు(అటెంప్ట్స్), సన్నద్ధమయ్యే సమయం పెరగడమే ఇందుకు కారణం అని చెప్తున్నారు. 2019లో జనరల్ క్యాటగిరీ కటాఫ్ 89.5 పర్సంటైల్గా ఉంది.