కరోనా నేపథ్యంలో నిర్ణయం
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడి
న్యూఢిల్లీ, మే 4: దేశంలో కరోనా ఉద్ధృతి కారణంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి 28 వరకు నిర్వహించాల్సిన ‘మే నెల సెషన్ పరీక్ష’ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం ప్రకటించింది. ఇదివరకే ఏప్రిల్ సెషన్ పరీక్ష వాయిదా పడింది. ఈ రెండు సెషన్ల రీషెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. ఈ పరీక్ష కోసం తెలంగాణ నుంచి 51,896 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్స్ను 4 విడతలుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రెండు సెషన్లు (జనవరి, ఫిబ్రవరి) ఇప్పటికే పూర్తయ్యాయి. ఏప్రిల్, మేలో నిర్వహించాల్సిన తదుపరి రెండు సెషన్లు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. 4 సెషన్లలో వచ్చిన అత్యధిక స్కోర్ ఆధారంగా ర్యాంకులను ప్రకటిస్తారు.