పట్నా : బిహార్లో కుల గణన (Caste Census) చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడాన్ని జేడీయూ నేత విజయ్ కుమార్ చౌధరి తప్పుపట్టారు. కుల గణనపై బిహార్ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కూడా సమర్ధించిందని బిహార్ ఆర్ధిక మంత్రి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కులగణన అంశంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తలదూర్చుతోందని మండిపడ్డారు. సర్వోన్నత న్యాయస్ధానంలో కుల గణనపై కేంద్ర ప్రభుత్వ తీరు హాస్యాస్పదమే కాకుండా బిహార్లో పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆక్షేపించారు. సుప్రీంకోర్ట్లో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో జనగణన కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉందని పేర్కొంది.
అయితే జనగణన కేంద్ర ప్రభుత్వ విధుల్లో భాగమని, కానీ తాము జనగణన చేపట్టడం లేదని కేవలం కుల గణన నిర్వహిస్తున్నామని, దీనికి హైకోర్టు సమ్మతి కూడా ఉందని జేడీయూ నేత స్పష్టం చేశారు. ఇది జనగణన కంటే పూర్తి భిన్నమైనదని చెప్పుకొచ్చారు. కులగణనకు కేంద్రం అనుకూలమా, వ్యతిరేకమా అనేది ఎందుకు తేల్చిచెప్పడం లేదని మంత్రి నిలదీశారు. బీజేపీ సైతం కులగణనపై మౌనం దాల్చిందని, దీనిపై ఆ పార్టీ తన వైఖరి వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read More :