న్యూఢిల్లీ : తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాషాయ పార్టీ సైన్యం వెనుక దాక్కుంటోందని జేడీ(యూ) నేత గులాం రసూల్ బలైవై ఆరోపించారు. భారత సైన్యంలో ముస్లింలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేండ్లయిన సందర్భంగా గులాం రసూల్ విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల కోసం బీజేపీ సైనికుల నెత్తురుతో రాజీ పడిందని దుయ్యబట్టారు. మన సైనిక దళాల సాహసం, త్యాగాలను కాషాయ పార్టీ రాజకీయ లబ్ధికి వాడుకుందని మండిపడ్డారు. బీజేపీ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సైన్యాన్ని ఆశ్రయించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
సైన్యంలో ముస్లింలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా జేడీయూ నేత వ్యాఖ్యలపై పార్టీ సీనియర్ నేత, బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. సైన్యంలో ముస్లింలకు రిజర్వేషన్ డిమాండ్ను నితీష్ తోసిపుచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఆయనను వివరణ కోరతానని చెప్పారు. ఎన్నో విషయాలపై ఇష్టానుసారం మాట్లాడటం కొందరికి అలవాటైందని..దీనిపై తాను త్వరలోనే గులాం రసూల్ను వివరణ అడుగుతానని తెలిపారు.