Nitish Kumar | పాట్నా/న్యూఢిల్లీ, జనవరి 27: బీహార్ రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడుస్తున్నది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్ మహాఘట్ బంధన్కు గుడ్బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టు కట్టేందుకు పావులు కదుపుతున్నారనే విస్తృత ప్రచారం నేపథ్యంలో ఏ క్షణం.. ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొన్నది. సంకీర్ణ ప్రభుత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో నితీశ్ ఆదివారం సీఎం పదవికి రాజీనామా చేసి, అనంతరం బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకొన్నట్టు తెలుస్తున్నది.
ఆదివారం ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభ పక్ష సమావేశం ఉంటుందని, ఆ తర్వాత నితీశ్ రాజీనామా చేస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అనంతరం బీజేపీ నేతలతో సమావేశం తర్వాత నేరుగా రాజ్భవన్కు వెళ్లి, గవర్నర్కు రాజీనామా పత్రం సమర్పిస్తారని తెలిపాయి. దీంతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను అందజేస్తారని, ఆ వెంటనే సాయంత్రం 4 గంటలకు మరోసారి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలిపాయి. కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నితీశ్ వెంట వెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఉన్న ఆర్జేడీ మంత్రులను తొలగించి, వారి స్థానంలో బీజేపీకి చెందిన వారికి క్యాబినెట్లోకి తీసుకోనున్నారనే వాదన కూడా ఉన్నది.
రాష్ట్రంలో సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకొనేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం బీజేపీ కూటమిలో ఉన్న హిందుస్థాన్ అవామ్ మోర్చా చీఫ్ మాజీ సీఎం జితన్ మాంఝీతో కాంగ్రెస్ సంప్రదింపులు చేసినట్టు తెలుస్తున్నది. ఇండియా కూటమిలో చేరాలని మాంఝీకి ఫోన్ చేసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నితీశ్తో మాట్లాడేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు.
జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ నేతలు సమావేశాలు, చర్చల్లో మునిగిపోయారు. పాట్నాలో నితీశ్ కుమార్ నివాసంలో జేడీయూ నేతలు సమావేశమయ్యారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది. నితీశ్కు మద్దతు తెలుపుతూ ఎమ్మెల్యేలు లేఖను రాష్ట్ర పార్టీ నేతలకు అందజేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీహార్ బీజేపీ నేతలు పలువురు అధిష్ఠానం పెద్దలతో కూడా భేటీ అయినట్టు తెలుస్తున్నది. అర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలు సమావేశం అయ్యారు. ఏ నిర్ణయమైనా తీసుకొనే అధికారాన్ని ఆర్జేడీ అధినేత లాలూకు ఎమ్మెల్యేలు అప్పగించారని ఎంపీ మనోజ్ ఝా వెల్లడించారు.
జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్కు బీజేపీ అంత ఉదారంగా మద్దతు పలుకడం లేదని తెలుస్తున్నది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవులు ఇవ్వాలని షరతులు పెట్టినట్టు సమాచారం. సీఎంగా నితీశే ఉండి.. తమ పార్టీకి రెండు డిప్యూటీ సీఎంలు, అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదలను బీజేపీ నేతలు అంతర్గతంగా జేడీయూ నేతల వద్ద పెట్టినట్టు తెలుస్తున్నది. అయితే పదేపదే కూటములను మార్చే నితీశ్కు మళ్లీ మద్దతు పలుకుడంపై రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.