Samtrat Chowdary – Bihar | మిత్రపక్షం జనతాదళ్ (యునైటెడ్) అధినేత, సీఎం నితీశ్ కుమార్పై బీహార్ డిప్యూటీ సీఎం, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలను ఆర్జేడీ చీలుస్తుందన్న భయంతోనే తమతో కలిసి నితీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారన్నారు. ‘ఆర్జేడీ నేతలు, శ్రేణుల వ్యాఖ్యలను గుర్తు చేసుకుందాం. వారు మహా కూటమి సర్కార్లో భాగస్వాములుగా ఉన్నప్పుడు 2024లో జేడీయూ కథ ముగుస్తుంది’ అని పాట్నాలో సోమవారం మీడియాతో చెప్పారు.
ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ వ్యాఖ్యలను సామ్రాట్ చౌదరి గుర్తు చేశారు. `2024లో జేడీయూ కథ ముగుస్తుంది` అని తేజస్వీ యాదవ్ అన్న సంగతి గుర్తు చేశారు. నితీశ్ కుమార్ పార్టీని చీల్చడం కోసం పని చేస్తున్నట్లు సంకేతాలిచ్చారు. ‘జేడీయూను చీల్చడానికి చేసే ప్రయత్నాలతో ప్రజాస్వామ్యం సిగ్గు పడుతుంది’ అని చెప్పారు. 2022 ఆగస్టులో ఆర్జేడీ సారధ్యంలోని మహా కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేశాక 17 నెలలకే తిరిగి బీజేపీతో జేడీయూ జత కట్టడానికి కారణం అని పేర్కొన్నారు. ‘జేడీయూ నేత, మాజీ మంత్రి సంజయ్ కుమార్ ఝా ద్వారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జేడీయూ మా ముందు ప్రతిపాదన చేసింది’ అని తమ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు కారణాలు వివరించారు.
బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వ్యాఖ్యలను ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్రంజన్ గగన్ తిప్పి కొట్టారు. ‘2022లో ఎన్డీఏను వీడినప్పుడు.. జేడీయూను చీల్చేందుకు బీజేపీ పని చేస్తుందని నితీశ్ ఆరోపించారు. ఇప్పుడు వారు ఆర్జేడీపై బురద చల్లుతున్నారు. కానీ, మా పార్టీ ప్రజాతీర్పును గౌరవిస్తుంది. బీజేపీ మాదిరిగా భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేలను చీల్చబోదు’ అని పేర్కొన్నారు. బీజేపీ నేత కొత్త సాకులు చెప్పడానికి ముందు చర్చించుకుంటే మంచిదని సూచించారు.