మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గాలు చేపట్టాలని కమలదళం కుట్రకు తెరతీసింది. దీంట్లో భాగంగా కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ను ఆయుధంగా మార్చుకున్నది. అయితే, బీజేపీకి సీఎం నితీశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆర్సీపీ సింగ్.. జేడీయూని వీడిపోయేట్టు చేశారు. మోదీ మంత్రివర్గంలో ఇక తాము చేరేదిలేదని తేల్చిచెప్పారు. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ భేటీలో చర్చించే అవకాశమున్నది.
పాట్నా, ఆగస్టు 7: బీహార్లో మిత్రపక్షంగా ఉన్న జేడీ(యూ)కు వెన్నుపోటు పొడిచి రాష్ట్రంలో సోలోగా అధికార పగ్గాలు చేపట్టాలని బీజేపీ పథకం వేసినట్టు కనిపిస్తున్నది. అందుకే జేడీయూ నేత ఆర్సీపీ సింగ్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ పావులు కదిపింది. రాజ్యసభ నామినేటెడ్ పోస్టు ఆఫర్ చేసింది. త్వరలో చేపట్టనున్న కేంద్ర మంత్రివర్గ మండలి విస్తరణలో మినిస్టర్ పోస్టుకు ప్రతిపాదనలు కూడా పంపింది. దీంతో తన పేరును నితీశ్ సిఫారసు చేస్తారని ఆర్సీపీ భావించారు. అయితే, గత కొంతకాలంగా బీజేపీ వ్యవహార శైలిని గమనిస్తున్న నితీశ్ కమలవ్యూహానికి చెక్ పెట్టారు.
బీజేపీ ప్రతిపాదనను తిరస్కరించారు. మోదీ సర్కారు క్యాబినెట్లో భాగం కాబోమని తేల్చిచెప్పారు. 2019 లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరకూడదని తాము తీసుకున్న నిర్ణయానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్తో ప్రకటన చేయించారు. అలాగే, పార్టీలో చీలికలకు ప్రయత్నిస్తున్న ఆర్సీపీ సింగ్కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలోనే ఆర్సీపీ సింగ్కు, ఆయన కుమార్తెలకు సంబంధించిన స్థిరాస్తుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై వివరణ ఇవ్వాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఆర్సీపీ సింగ్ పార్టీని వీడారు. పార్టీని వీడిపోతున్న సమయంలో.. జేడీ(యూ) ఓ మునిగిపోతున్న నావ అంటూ ఆర్సీపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
బీజేపీ వ్యూహాలను పసిగట్టిన నితీశ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం పార్టీ అంతర్గత సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ భేటీకి జేడీయూకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ హాజరవ్వాలని సూచించారు. భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నేతలతో సంప్రదించి నితీశ్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. కాగా బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సింగ్ను ఆ పదవి నుంచి తొలగించాలని నితీశ్ చేసిన డిమాండ్ను రాష్ట్ర బీజేపీ నాయకులు పరిగణలోకి తీసుకోకపోవడం, ఇటీవలే పార్టీని వీడిన ఆర్సీపీ సింగ్కు కమలదళం నేతలు సన్నిహితంగా మెలగడం తదితర కారణాల వల్ల బీజేపీని నితీశ్ క్రమంగా దూరం పెడుతున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి నితీశ్ గైర్హాజరయ్యారు.