బెంగళూరు: తమ పార్టీ బీజేపీతో జతకడుతుందని కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, తమ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తమ రెండు పార్టీలు కలిసికట్టుగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తాయని వెల్లడించారు. ఈ మేరకు తమ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మీడియాతో అన్నారు. పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ, పార్టీ వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని తనకు సూచించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి ఎలా ముందుకు సాగాలన్న దానిపై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించినట్లు చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు గురించి మీడియా ప్రశ్నించగా, దానికి ఇంకా సమయం ఉందంటూ సమాధానం దాటవేశారు.
కాగా, గురువారం రాత్రి జేడీ(ఎస్) శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఆ పార్టీ చీఫ్ హెచ్డీ దేవగౌడ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీతో జతకట్టడం, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే మిత్రపక్షంగా ఉండటంపై చర్చించారు. అలాగే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పేందుకు, పార్టీ బలోపేతం కోసం, అన్ని వర్గాల ప్రాతినిధులతో కూడిన 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జేడీ(ఎస్) నిర్ణయించింది.