గువహటి : అసోంను జపనీస్ ఎన్సెఫలిటిస్(బ్రెయిన్ ఫీవర్) వైరస్ వణికిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మొన్నటి వరకు వరదలతో అతలాకుతలమైన మొరిగావ్, నల్బరి జిల్లాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. అసోం వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి 23 మంది మరణించినట్లు వైద్యారోగ్య అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మోరిగావ్, నల్బరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. ఇక కొత్తగా 16 కేసులు నమోదైనట్లు తెలిపారు.
కొత్త కేసుల్లో నగావ్ జిల్లాలో మూడు, నల్బరి, ఉదల్గురిలో 3 చొప్పున, శివసాగర్లో రెండు, బార్పేట, కామరూప్, కర్బీ, హోజాయి జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అసోంలో ఈ వైరస్ బారిన పడి 2018లో 277 మంది, 2019లో 514, 2020లో 147, 2021లో 131 మంది చనిపోయారు.