పెండ్లి చేసుకుంటే ఖర్చు.. పిల్లలను కనాలంటే ఖర్చు.. వాళ్లను పెంచాలంటే ఖర్చు.. చదువుకు ఖర్చు.. రోగమొస్తే ఖర్చు.. ఖర్చు.. ఖర్చు.. ఖర్చు.. వచ్చే అరకొర జీతంతో, కుంటుకుంటైనా జీవితాన్ని మోయాలి. ఎందుకీ తంటా.. సోలోగా బతికేస్తే పోలా! బంధాల బాధలుండవు, ఆంక్షలుండవు, అడిగేటోళ్లుండరు. ఇంతకంటే హాయి ఇంకేం ఉంటుంది. ఇదే ఇప్పటి యువత ఆలోచన. అందుకే, పెండ్లి అంటేనే గజగజ వణికిపోతున్నారు. ఇదే ఇప్పుడు కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. జనాభా సంక్షోభంతో తల్లడిల్లుతున్నాయి. జనాభాను పెంచుకొనేందుకు ఓ దేశం ఆఫర్లు ఇస్తుంటే, ఇంకో దేశం హాలీడేస్ ఇస్తున్నది, మరో దేశం నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నది. -నేషనల్ డెస్క్
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియాతో పాటు పలు ఐరోపా దేశాల్లో దాదాపు ఇదే పరిస్థితి. ఒకనాడు పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేసేందుకు పిల్లలను కనడంపై ఆంక్షలు విధించిన దేశాలు.. నేడు పిల్లలను కనండి బాబోయ్! అంటూ వేడుకుంటున్నాయి. ఇంకో అడుగు ముందుకేసి ప్రోత్సాహకాలు కూడా ప్రకటిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులు, దానికి తగ్గట్టుగా పెరగని ఆదాయంతో తాను బతకడమే కష్టం, ఇక పెండ్లి చేసుకొని పిల్లలను కని వారిని ఎలా పోషించాలనే భావన అక్కడి యువతలో కనిపిస్తున్నది.
ప్రపంచంలో జనాభా సంక్షోభంలో ప్రధానంగా కూరుకుపోతున్న దేశం జపాన్. గత పదిహేనేండ్లుగా ఇక్కడ జనాభా రేటు భారీగా పడిపోతున్నది. ఇప్పుడున్న జనాభా కొనసాగాలంటే జపాన్లో జననాల రేటు 2.1% ఉండాలి. కానీ, 1.3 మాత్రమే ఉంది. గత ఏడాది జపాన్లో 15 లక్షల మరణాలు సంభవించగా, 8 లక్షల జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 12.5 కోట్లు ఉన్న జపాన్ జనాభా 2060 నాటికి 8.6 కోట్లకు పడిపోతుంది. అక్కడి ప్రభుత్వం గత కొన్నేండ్లుగా జనాభాను పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినా సరైన ఫలితాలు రావటం లేదు. ఇలా అయితే కష్టమని.. జనాభా పెంచేందుకు ప్రజల్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రభుత్వ శాఖను ప్రారంభించారు. ఇప్పటివరకు పిల్లలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఖర్చును రెట్టింపు చేస్తున్నట్టు జపాన్ ప్రధాని కిషిద ప్రకటించారు. ఇప్పటికే అక్కడ పిల్లల్ని కనే వారికి సబ్సిడీలు, చూసుకునేందుకు సెలవులు కూడా ఇస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనానూ జనాభా సంక్షోభం ముంచెత్తబోతున్నది. పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు 1980ల్లో చైనా ఏక సంతాన విధానాన్ని కఠినంగా అమలు చేసింది. ఈ విధానం వల్ల చైనా ప్రజల్లో ఒకరినే కనాలనే భావన పాతుకుపోయింది. ఫలితంగా అక్కడ జననాల రేటు తగ్గిపోతున్నది. 1960 తర్వాత మొదటిసారి 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. గత కొన్నేండ్లుగా జనాభా తగ్గుదలతో అప్రమత్తమైన చైనా 2015లో ఏక సంతాన విధానం తొలగించి ఇద్దరిని కనవచ్చని చెప్పింది. 2021 నుంచి ముగ్గురిని కనాలని చెప్తున్నది. ప్రభుత్వం ఏం చెప్పినా చైనా యువత మాత్రం పెండ్లివైపు మొగ్గు చూపడం లేదు. ఒంటరి జీవితం గడపడానికే ఓటేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రేమలో పడేందుకు అక్కడి తొమ్మిది కాలేజీలు వారం పాటు సెలవులు ప్రకటించాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
ప్రపంచంలో తక్కువ సంతానోత్పత్తి ఉన్న దేశం దక్షిణ కొరియా. ఆ దేశ సంతానోత్పత్తి రేటు 0.79 మాత్రమే ఉన్నది. ఒకవైపు తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు వల్ల దేశం జనాభా సంక్షోభంతో ఉంటే అక్కడ యువత అసలు పెండ్లిళ్లకే ఇష్టపడటం లేదు. గత ఏడాది అక్కడ వివాహాల సంఖ్య రికార్డు స్థాయిలో పడిపోయింది. జీవన వ్యయం భారీగా పెరిగిపోవటం, పిల్లల పోషణకు ఖర్చు పెరగటం వల్లే దక్షిణ కొరియా యువత పెండ్లి, పిల్లలకు దూరంగా ఉంటున్నారని పలు నివేదికలు చెప్తున్నాయి. 2021లో వెయ్యి మంది జనాభాకు వివాహాల రేటు 3.8 నమోదు కాగా, 2022లో 3.7కు తగ్గింది. దీంతో యువతను పెండ్లి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టీవీ షోలు ఏర్పాటు చేస్తున్నది.