Prashant Kishor : ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ (Jan suraj Party) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kisore) ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. బీహార్ (Bihar) లోని బంకిపూర్ (Bankipur) అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో ఆయన పోటీ చేయనున్నట్టు జన్ సురాజ్ పార్టీ చీఫ్ మనోజ్ భారతి (Manoj Bharati) ఆదివారం ప్రకటించారు. దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి కిశోర్ బరిలో దిగుతుండటంతో ఆయన రాజకీయ అరంగేట్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బంకిపూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. బంకిపుర్ స్థానంలో బీజేపీ దశాబ్దాలుగా వరుస విజయాలు సాధిస్తోంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. పార్టీ పూర్తి విశ్వాసంతో, శక్తియుక్తులతో ఈ ఉపఎన్నికలో పోరాడుతుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఈ విజయమే పునాది వేస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
‘గత నాలుగేళ్లుగా జన్ సురాజ్ నా జీవితంగా మారింది. బీహార్లో మార్పు లక్ష్యం నెరవేరే వరకు ఇదే నా ధ్యేయం. బంకిపూర్ ఉపఎన్నికలో పోటీచేసే బాధ్యతను ఆ లక్ష్యం దిశగా ఒక అడుగుగా భావిస్తున్నాను’ అని కిశోర్ తెలిపారు. తనపై నమ్మకముంచిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బంకిపూర్ ఉపఎన్నికకు జూలై 30న పోలింగ్ జరగనుండగా.. ఆగస్టు 3న ఫలితాలు వెలువడనున్నాయి.
ఈ ఎన్నికల్లో కిశోర్కు మద్దతిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే బీజేపీ కంచుకోటను బద్దలుకొట్టే ప్రయత్నంలో రాష్ట్రీయ జనతా దళ్ కూడా పీకేకు మద్దతు ఇస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.