శ్రీనగర్: జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాల వల్ల రాంబన్, ఉధంపూర్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారిని మూసివేసినట్లు జమ్ముకశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు శనివారం తెలిపారు. హైవేకి ఎదురుగా ఉన్న ఒక కొండపై నుంచి రాళ్లు పడినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (జాతీయ రహదారి) షబీర్ మాలిక్ తెలిపారు. కేలా మోర్, మౌంపాసితో సహా రాంబన్-బనిహాల్ సెక్టార్ మధ్య అనేక ప్రదేశాల్లో కూడా కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు.
అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైవేపై పునరుద్ధరణ పనులకు ఆటంకం కలిగిస్తున్నాయని మాలిక్ అన్నారు. వర్షం ఆగిన తర్వాత కెఫెటేరియా మోర్హ్ ప్రాంతంలో విరిగిన కొండచరియలను తొలగించేందుకు కనీసం ఐదు గంటల సమయం పడుతుందని తెలిపారు. రోడ్ క్లియరెన్స్ ఆపరేషన్ కోసం సంబంధిత ఏజెన్సీలు తమ మనుషులు, మెషీన్లను సిద్ధంగా ఉంచారని ఆయన వెల్లడించారు.