న్యూఢిల్లీ: అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) ఆతిథ్యమివ్వనుంది. భారత్ దేశంలో తొలిసారిగా జీ 20 సదస్సు (G-20 Summit) 2023లో జరుగనుంది. ఈ సమావేశాలను జమ్ముకశ్మీర్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జమ్ముకశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం విశేషం.
జీ 20 సభ్యదేశాల్లో ఒకటి ప్రతి ఏటా డిసెంబర్లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్కు జీ 20 అధ్యక్షత బాధ్యలు ఈ ఏడాది డిసెంబర్ 1న లభిస్తాయి. ఇందులో భాగంగా 2023 నవంబర్ 30 వరకు కూటమికి సమావేశాలకు సంబంధించిన వ్యవహారాలను భారత్ నిర్వర్తిస్తుంది. దీంతో వచ్చే ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జరిగే 18వ జీ-20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దాని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమలుకు వెసులుబాటు కల్పించడం కోసం సెక్రటేరియట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
జీ 20.. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగిన దేశాల కూటమి. ఇది 1999, సెప్టెంబర్ 25న ఏర్పడింది. అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించేందుకు ఇది రూపొందింది.