US M16-M4 Rifles | అగ్రరాజ్యం అమెరికా 2021లో ఆఫ్ఘనిస్తాన్ను వీడిన తర్వాత నాటో దళాలకు చెందిన అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రి అక్కడే ఉండిపోయింది. ఆయుధ సంపత్తి అంతా తాలిబాన్ల ఆధీనంలోకి వచ్చింది. ఈ మరణ ఆయుధాలన్నీ తాజాగా పాక్ మీదుగా జమ్మూ కశ్మీర్కు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత భద్రతా దళాలు, నిఘా సంస్థలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాయి. ఇటీవల పూంచ్లో జరిగిన దాడిలో అమెరికాకు చెందిన M16 రైఫిల్, M4 కార్బైన్ వంటి ఆయుధాలతో జమ్మూకశ్మీర్లో యాక్టివ్గా ఉన్న పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైష్-ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదులు లోయలో తలదాచుకున్నారని, ఎంత మంది ఉన్నారనేది పక్కా సమాచారం లేదని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఆయుధాలతో పాటు ఆఫ్ఘన్లో విరివిగా ఉపయోగించే ‘స్టీల్ బుల్లెట్లు’ ఇప్పటికే లోయలో ఉగ్రవాదులు వినియోగిస్తున్నట్లుగా సమాచారం.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ తర్వాత 85 బిలియన్ డాలర్ల విలువైన విమానాలు, సాయుధ వాహనాలు, రాకెట్ రక్షణ వ్యవస్థలు, మెషిన్ గన్స్, అస్సాల్ట్ రైఫిల్స్ తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబాన్ చేతిలో ఉన్న తమ అత్యాధునిక విమానాలు, సాయుధ వాహనాలు, రాకెట్ డిఫెన్స్ సిస్టమ్లను నిలిపివేసినట్లు అమెరికా తెలిపింది. అయితే ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్లు ఆఫ్ఘనిస్తాన్లో 4 సీబ్-130 ట్రాన్స్పోర్ట్స్, 23 ఎంబ్రేర్ EMB 314/A29 సూపర్ సుకానో, 28 సెస్నా 208, 10 సెస్నా AC-208 స్టైక్ ఎయిర్క్రాఫ్ట్లతో పాటు 33 Mi-17, 33 UH-60 బ్లాక్హాక్, 43 MD 530 హెలికాప్టర్లు కూడా ఆఫ్ఘన్లోనే అమెరికా వదిలి వెళ్లింది. అమెరికన్ 22174-Humvey, 634 Mi 117, 155 MXX ప్రో మైన్ ప్రూఫ్ వెహికల్, 169 Mi 13 ఆర్మ్డ్ పర్సనల్ క్యారియర్, 42000 పికప్ ట్రక్, ఎస్యూవీలు, 64,363 మెషిన్ గన్, ట్రక్కులు, 80, 56, 50, 50, 56 సాల్ట్ రైఫిల్స్ సైతం ఉన్నాయి.
అమెరికా సైన్యం 1960ల నుంచే ఎం16 ఆటోమేటిక్ రైఫిల్స్ను ఉపయోగిస్తున్నది. వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, సోమాలియా అంతర్యుద్ధం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్పై పోరాటం సమయంలోనూ అమెరికా సైన్యం ఈ రైఫిల్స్ను వినియోగించింది. ఈ రైఫిల్ బరువు 3.26 కిలోల (అన్లోడ్) వరకు ఉంటుంది. లోడ్ చేసిన రైఫలిల్ నాలుగు కిలోల వరకు ఉంటుంది. ఎం16 నిమిషానికి 700-950 రౌండ్లు కాల్చే సత్తా దీని సొంతం. ఎం4 రైఫిల్ అమెరికాలో సైన్యంలో ఉన్నది. ఈ కార్బైన్లు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, ఇరాక్ యుద్ధం, కొలంబియన్ సాయుధ సంఘర్షణ, దక్షిణ ఒస్సేటియా యుద్ధం, లెబనాన్ యుద్ధం, మెక్సికన్ డ్రగ్ వార్ అనేక ఇతర కార్యకలాపాల్లోనూ వినియోగించింది. ఖాళీ రైఫిల్ బరువు 2.88 కిలోల బరువు ఉంటుంది. లోడ్ చేసిన రైఫిల్ 3.1 కిలోల వరకు ఉంటుంది. ఒక్క మ్యాగజైన్లో 30 రౌండ్లు ఉంటాయి. ఈ రైఫిల్ నిమిషానికి 700-950 రౌండ్లు కాల్చగలదు.
పూంచ్లో ఇటీవల ఆర్మీ ట్రక్పై ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉగ్రవాదుల కోసం బలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజౌరిలో ఉగ్రవాదుల గురించి పక్కా సమాచారం అందుకున్న బలగాలు వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు తప్పించుకునేందుకు కాల్పులు జరుపడంతో పాటు పేలుడు పదార్థాలను వినియోగించడంతే ఐదుగురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనలో తప్పించుకున్న ఉగ్రవాదుల జాడ ఇంకా ఆర్మీ అధికారులకు చిక్కలేదు. అయితే, తాలిబన్ల నుంచి అందిన ఆయుధాల సహాయంతోనే పూంచ్లో దాడి జరిగిందని బలగాలు అనుమానిస్తున్నాయి.
ఉగ్రవాదులు స్టీల్ బుల్లెట్లను వినియోగించారని, ఈ బుల్లెట్లు ఎలాంటి వాహనం నుంచైనా దూసుకెళ్లగలవని ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణ బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు సైతం రక్షించలేవని పేర్కొంటున్నారు. పాక్కు చెందిన ఉగ్రవాదులు పూంచ్లో ఆర్మీ వాహనంపై దాడి చేసిన తర్వాత తిరిగి సరిహద్దులు దాటి వెళ్లే అవకాశం ఉందని, వాదనలను కొట్టిపారేయలేమని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా రైఫిల్స్, స్టీల్ బుల్లెట్లు లోయలోకి చేరితే పరిస్థితులు దారుణంగా ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో చాలా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జాకెట్స్, పట్కాలు ‘లెవెల్-3’ కేటగిరికి చెందినవే. దేశంలో ఎక్కడా ‘లెవల్-4’ బుల్లెట్ ప్రూఫ్ కవచాలు లేవు. వీటిని ఎంపిక చేసిన కార్యకలాపాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.