న్యూఢిల్లీ : భారత్కు చెందిన ఓ వ్యక్తి 29 ఏండ్ల పాటు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించాడు. శిక్ష కాలం పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం భారత్కు తిరిగొచ్చిన ఆ వ్యక్తికి కుటుంబ సభ్యుల నుంచి అపూర్వమైన స్వాగతం లభించింది. స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్లోని కతువా జిల్లాకు చెందిన కుల్దీప్ సింగ్ అనే వ్యక్తి 1992, డిసెంబర్ నెలలో.. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దును దాటాడు. దీంతో అతన్ని పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకున్నది. గూఢచారి కేసులకు సంబంధించి కుల్దీప్ నాలుగు విచారణలను ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్లోని కోట్ లఖ్పత్ జైల్లో 29 ఏండ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలో ఇండియన్ హై కమిషన్ పోరాటంతో.. కుల్దీప్ ఈ ఏడాది డిసెంబర్ 20న స్వదేశానికి తిరిగొచ్చాడు. అమృత్సర్లోని వాఘా సరిహద్దు వద్ద కుల్దీప్ను భారత అధికారులకు పాక్ అప్పగించింది.
ఈ సందర్భంగా కుల్దీప్ సింగ్ మాట్లాడుతూ.. తన కుటుంబంతో మళ్లీ కలవడం సంతోషంగా ఉందన్నాడు. తాను కొత్త జీవితాన్ని పొందానని ఆనందభాష్పాలు రాల్చాడు. పాక్ ఆర్మీకి చిక్కిన ప్రతీ భారతీయుడిని గూఢచారిగా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కఠిన కారాగార శిక్ష విధిస్తున్నారని తెలిపాడు. పాక్ పెడుతున్న చిత్రహింసలకు 10 నుంచి 12 మంది భారతీయులు అక్కడి మెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశాడు.