Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లో వేసవి సెలవులు ముగిశాయి. ఈ నెల 22 నుంచి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ తాజాగా ప్రకటన చేసింది. ఈ నిర్ణయం కాశ్మీర్ డివిజన్లోని వింటర్ జోన్ పాఠశాలలతోపాటు, జమ్మూ డివిజన్లోని పాఠశాలలకు కూడా వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 22 నుంచి తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం కావాలి.
కానీ, వేసవి తాపం, భారీ ఎండల నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవుల్ని పొడిగించింది. సాధారణంగా జూలై 6 వరకు అక్కడ వేసవి కాలం ముగుస్తుంది. కానీ, ఈసారి ఎండలు మరింత ఎక్కువగా ఉన్నాయి. భారీగా నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం కారణంగా వేసవి సెలవుల్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ రోజు నుంచే పాఠశాలలు ప్రారంభమవుతాయని గతవారం ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇంకా అక్కడ వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో మరో రెండు రోజులు సెలవుల్ని పొడిగించింది. దీంతో బుధవారం, జూలై 22 నుంచి స్కూల్స్ ప్రారంభమవుతాయని జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి సకినా ఇట్టూ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.
మరోవైపు దేశమంతా ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ ముగిసి, విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. గత నెలలోనే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. అయితే, కాశ్మీర్ వాతావరణ పరిస్థితులు వేరుగా ఉండటం వల్ల అక్కడ స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభమవుతాయి. ప్రస్తుతం అక్కడ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.