Gulmarg : జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో భారీ ప్రమాదం తప్పింది. కేబుల్ కార్ మధ్యలో నిలిచిపోవడంతో పర్యాటకులు అందులో చిక్కుకుపోయారు. గాలిలోనే వేలాడుతూ గంటసేపుపైగా ఉండిపోయారు. వెంటనే స్పందించిన సహాయక సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటన సోమవారం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పర్యాటక కేంద్రం గుల్మార్గ్. ఇక్కడి గొండోలా వద్ద కేబుల్ కార్ బాగా ఫేమస్. సోమవారం ఈ కేబుల్ కార్లలో 300 మందికి పైగా పర్యాటకులు ఉండగా, సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది.
దీంతో ప్రయాణికులంతా భయంభయంగా ప్రాణాలు అరచేత పట్టుకుని గాలిలో వేలాడుతూ క్యాబిన్లలోనే ఉండిపోయారు. దాదాపు గంటసేపటికిపైగా ఇలా కేబుల్ కార్లు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, టెక్నికల్ స్టాఫ్ స్పందించారు. పర్యాటకుల్ని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. చాలాసేపు శ్రమించి 300 మంది పర్యాటకుల్ని రక్షించినట్లు తెలుస్తోంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎవరికీ, ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. పర్యాటకుల్ని వారి గమ్యాలకు కూడా తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనతో అక్కడ కేబుల్ కార్ ఆపరేషన్స్ నిలిపివేశారు.
సాంకేతిక సమస్యను పరిష్కరించిన తర్వాత, పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం మాత్రమే కేబుల్ కార్ సేవలు ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పరిస్తితి అదుపులోనే ఉందని, పర్యాటకులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదని తెలిపారు. ఇక్కడి పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. అయితే, ఇలాంటి కేబుల్ కార్ నిర్వహణలో సమస్య ఎదురైనప్పుడు అధికారులు స్పందించి, అందరినీ రక్షించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అధికారులు వేగంగా స్పందించడం వల్లే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉందని, లేదంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు అన్నారు.