న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: పేదలు, యువత, మహిళలు, రైతుల్ని ఆకట్టుకునేలా వివిధ అభివృద్ధి, సంక్షేమ అంశాలతో బీజేపీ తన మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను విడుదల చేసింది. ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన, వన్ నేషన్.. వన్ ఎలక్షన్, ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అంశాలను మళ్లీ చేర్చారు. అయితే వివాదాస్పద ఎన్నార్సీని మాత్రం మ్యానిఫెస్టో నుంచి తప్పించారు.
70 ఏండ్లు దాటిన వారికి ‘ఆయుష్మాన్ భారత్’ను వర్తింపజేస్తామని బీజేపీ తాజా మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది. దేశంలో నలుదిశలా తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో బుల్లెట్ రైలు తీసుకొస్తామని ప్రకటించింది. 2036 ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించేందుకు బిడ్లో పాల్గొంటామని తెలిపింది. మొత్తం 14 అంశాలతో మ్యానిఫెస్టోను రూపొందించింది.