Jamili elections | భువనేశ్వర్, సెప్టెంబర్ 11: త్వరలో జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా కోసమే కేంద్రం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తెలిపారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరంలలో ఓడిపోతామని బీజేపీ ప్రభుత్వానికి తెలుసునని, అందుకే ఒకే దేశం-ఒకే ఎన్నిక అని నాటకాలాడుతున్నదని ధ్వజమెత్తారు. ‘అసలు మన దగ్గర ఒకే దేశం-ఒకే ఎన్నిక అస్సలు సాధ్యం కాదు. ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఒకవేళ ఒకే దేశం-ఒకే ఎన్నిక అమల్లోకి వస్తే ప్రభుత్వం పడిపోయిన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? ఇలా విధించడం ప్రజాస్వామ్య విరుద్ధం. అంతేకాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థ రాష్ట్రపతి పాలన వ్యవస్థ దిశగా ప్రయణించే ప్రమాదముంది. ఇదే జరిగితే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఉల్లఘించడమే అవుతుంది’ అని భూషణ్ హెచ్చరించారు. రాజ్యసభలో తమకు మెజారిటీ లేదని, బిల్లు పాస్ కాదని కూడా కేంద్రానికి తెలుసునని చెప్పారు. త్వరలో జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయడానికే జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చిందని భూషణ్ వెల్లడించారు.