హైదరాబాద్ : కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పొడిగించింది. ఈ ఏడాది ఆగస్టు నుంచి మరో ఏడాది పొడిగిస్తూ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2004 ఏప్రిల్ 2న నాటి యూపీఏ ప్రభుత్వం కృష్ణా ట్రైబ్యునల్ను ఏర్పాటు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ కోసం ఈ ట్రైబ్యునల్ ఏర్పాటైంది. అది ఆరేళ్లపాటు విచారణ కొనసాగించి 2010 డిసెంబర్ 30న నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ కర్ణాటక, మహారాష్ట్రలు చట్టంలోని సెక్షన్ 5(3)ని అనుసరించి 2011 మార్చి 29న మళ్లీ దరఖాస్తు చేశాయి. వాటిపై ఏడాదిలోపు ట్రైబ్యునల్ తుది నివేదికను కేంద్రానికి సమర్పించాలి. కాగా దానిపై వాదనలు ముగియకపోవడంతో కేంద్రం ఏటా ట్రిబ్యునల్ కాలపరిమితిని పొడిగిస్తూ వస్తున్నది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటివాటాను సైతం కృష్ణా నది ట్రిబ్యునల్ స్పష్టంగా తేల్చాల్సి ఉంది.