న్యూఢిల్లీ: జార్ఖండ్లో పునరుద్ధరించిన సింద్రీ ఎరువుల కర్మాగారాన్ని (Sindri fertilizer plant) ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. రూ.8,900 కోట్లకు పైగా వ్యయంతో తిరిగి అభివృద్ధి చేసిన ఈ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు. 2018లో తాను ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చినట్లు మోదీ తెలిపారు. ఏడాదికి సుమారు 12.7 ఎల్ఎంటీ యూరియా ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్, తెలంగాణలోని రామగుండంలో ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ తర్వాత దేశంలో పునరుద్ధరించిన మూడవ ఎరువుల కర్మాగారం సింద్రీ ప్లాంట్ అని మోదీ అన్నారు.
కాగా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఈ సందర్భంగా శుక్రవారం ఎక్స్లో రెండు ఫొటోలు షేర్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1952 మార్చ్లో సింద్రీ ప్లాంట్ ప్రారంభోత్సవం చేసిన ఫొటోలుగా ఆయన పేర్కొన్నారు. నెహ్రూ 1952లో సింద్రీ ప్లాంట్ను ప్రారంభించగా, ప్రధాని మోదీ ఇవాళ ఆ క్రెడిట్ పొందేందుకు ప్రయత్నించారని అందులో విమర్శించారు.
మరోవైపు 2002లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూసివేసిన దేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ సింద్రీ ఎరువుల కర్మాగారం కావడం విశేషం. అయితే 22 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ ప్లాంట్ను పునరుద్ధరించింది.
India's first Prime Minister, Late Pandit Jawaharlal Nehru, alongwith cabinet colleagues, at the inauguration of Sindri fertiliser factory in March 1952. Today of course, the Prime Minister is in Sindri claiming credit! pic.twitter.com/wkagvfwTs9
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 1, 2024