జైపూర్: ఒక ఎక్స్ప్రెస్ రైలులో మంటలు రాజుకున్నాయి. (train catches fire) ఒక స్టేషన్ వద్దకు ఆ రైలు చేరుకోగా అక్కడి సిబ్బంది దీనిని గమనించారు. వారు వెంటనే అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ వీల్స్ వద్ద చెలరేగిన మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ముప్పు తప్పింది. అర్ధరాత్రి వేళ ఈ సంఘటన జరుగడంతో ఆ రైలులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న జైపూర్ ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి వేళ సీ5 కోచ్లోని వీల్స్ వద్ద మంటలు రాజుకున్నాయి.
కాగా, ఆ రైలు దౌసా స్టేషన్కు చేరడంతో కోచ్ వీల్స్ వద్ద నిప్పురవ్వలను రైల్వే సిబ్బంది గమనించారు. అప్రమత్తమైన వారు వెంటనే ఆ మంటలను ఆర్పివేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆ రైలులోని ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అయితే మంటలు ఆర్పివేసిన తర్వాత ఆ రైలు తన ప్రయాణాన్ని కొనసాగించిందని, సురక్షితంగా జైపూర్ చేరుకున్నదని దౌసా రైల్వే స్టేషన్ మాస్టర్ రాధేశ్యామ్ మీనా తెలిపారు.