న్యూఢిల్లీ: జైనులు దేశ వ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే గుజరాత్లోని జైన్ ఆలయం ధ్వంసం సంఘటనను ఖండించారు. జార్ఖండ్లోని పార్శ్వనాథ్ హిల్స్ వద్ద జైనుల పవిత్ర ప్రార్థనా మందిరం సమీద్ శిఖర్జీ ఉంది. జైనుల ఆధ్మాత్మిక గురువులైన 24 మంది తీర్థాంకరులలో 20 మంది ఇక్కడ మోక్షం పొందినట్లు జైనుల నమ్మకం. అయితే జార్ఖండ్లోని సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. జైనులకు చెందిన ఈ పవిత్ర స్థలాన్ని పర్యాటక ప్రాంతంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో సమీద్ శిఖర్జీ పవిత్రత దెబ్బతింటుందని జైనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జైన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు జైనులు భారీగా తరలివచ్చారు. సమీద్ శిఖర్జీని టూరిస్ట్ ప్రాంతంగా ప్రకటించడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, డిసెంబర్ 16న గుజరాత్లోని ఒక జైన దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నిరసనల సందర్భంగా ఈ సంఘటనను కూడా జైనులు ఖండించారు. మరోవైపు విశ్వహిందూ పరిషత్తోపాటు ఏఐఎంఐఎం చీఫ్ అసద్దుద్దీన్ ఒవైసీ కూడా జైనుల నిరసనలకు మద్దతు తెలిపారు. జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.