న్యూఢిల్లీ, జనవరి 1: దేశవ్యాప్తంగా జైనులు ఆదివారం భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జార్ఖండ్లో గిరిడీహ్ జిల్లాలోని పార్శనాథ్ హిల్స్ వద్ద ఉన్న జైనుల పవిత్ర ప్రార్థనా మందిరమైన శ్రీ సమ్మేద్ శిఖర్జీని పర్యాటక ప్రాంతంగా ప్రకటిస్తూ హేమంత్ సొరేన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంతో పాటు, గుజరాత్లోని పాలితానాలో జైన ఆలయ ధ్వంసాన్ని ఖండిస్తూ ఢిల్లీతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ర్టాల్లో జైనులు ఆందోళనలు చేపట్టారు. ర్యాలీల్లో పెద్దయెత్తున జైనులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేటు వద్దకు జైనులు భారీగా తరలివచ్చారు. సమ్మేద్ శిఖర్జీని టూరిస్టు ప్రాంతంగా ప్రకటించే ఆలోచనను మానుకోవాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జైన మతంలో రెండు శాఖలైన దిగంబరులు, శ్వేతంబరులు కూడా సమ్మేద్ శిఖర్జీని అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. 24 తీర్థాంకరులలో 20 మంది ఇక్కడే మోక్షం పొందినట్టు జైనుల నమ్మకం.