న్యూఢిల్లీ: గత శుక్రవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో కాల్పుల ఘటన జరిగిన విషయం తెలిసిందే. గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని ఇద్దరు వ్యక్తులు కోర్టురూమ్లోని కాల్చి చంపారు. అడ్వకేట్ దుస్తుల్లో వచ్చిన వాళ్లు ఆ గ్యాంగ్స్టర్ను చంపేశారు. అయితే అక్కడ ఉన్న పోలీసులు ఆ ఇద్దరు ఆగంతకుల్ని హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొత్త అప్డేట్స్ ఇచ్చారు. తిహార్లో ఉన్న టిల్లు తాజ్పురియా షూటౌట్ ప్లాన్ వేసినట్లు తేలింది. అంతేకాదు, ఆ కాల్పుల ఘటనకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు అతను జైలులోని తన ఫోన్ నుంచి తెలుసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
నిజానికి ఒకప్పుడు టిల్లు, జితేంందర్ గోగిలు క్లాస్మేట్లు. అయితే వసూళ్ల విషయంలో గొడవ రావడంతో ఇద్దరూ విడిపోయారు. రెండు గ్యాంగ్లుగా దందా సాగిస్తున్నారు. 30 కేసుల్లో నిందితుడిగా ఉన్న జితేందర్ను పోలీసులు రోహిణి కోర్టులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అతన్ని తుదముట్టించాలని టిల్లు ప్లాన్ వేశాడు. దానికి ప్రకారం ఇద్దరు వ్యక్తుల్ని అడ్వకేట్ల రూపంలో కోర్టుకు పంపాడు. రాహుల్ త్యాగి, జగ్దీప్ జగ్గాలు.. మారువేషంలో ఆయుధాలతో కోర్టు రూమ్లోకి ప్రవేశించి జితేందర్ను హతమార్చారు. అయితే ఆ సమయంలో ఎప్పటికప్పుడు టిల్లు తన ఫోన్తో జైలు నుంచే అప్డేట్స్ తెలుసుకున్నాడు. గోగిని చంపేందుకు వెళ్లిన ఆ ఇద్దరు పోలీసుల కాల్పుల్లో మరణించారు. అయితే వాళ్లు ప్రతి నిమిషం టిల్లుకు తమ ప్లాన్ వివరాలు చెప్పినట్లు తెలుస్తోంది.
కోర్టులో చనిపోయిన ఇద్దరితో పాటు వినయ్, ఉమంగ్ అనే మరో ఇద్దరు కూడా టిల్లుతో టచ్లో ఉన్నారు. ఆ ఇద్దర్నీ ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు వెళ్లి అక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుపాలంటూ టిల్లు వాళ్లను ఆదేశించాడు. కోర్టులో భారీ బందోబస్తు ఉన్నట్లు తెలుసుకున్న టిల్లు.. ఆ ఇద్దర్నీ అక్కడ నుంచి పారిపోవాలని కోరాడు. ఆ తర్వాత ఫోన్ను స్విచాఫ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తీహార్ జైలులో ఖైదీలకు ఫోన్ ఎలా వచ్చిందన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.