Amethi-Raebareli | రాబోయే 24 నుంచి 30 గంటల్లో అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుందని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అమేథీ, రాయబరేలీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అధికారం ఇచ్చిందని తెలిపారు. మరో 24 నుంచి 30 గంటల్లో కాంగ్రెస్ చీఫ్ నిర్ణయం తీసుకొని అధికారిక ప్రకటన చేస్తారన్నారు. రెండు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యంపై అడిగిన ప్రశ్నకు జైరాం రమేశ్ స్పందించారు. ‘బీజేపీ రాయబరేలీ అభ్యర్థిని ప్రకటించిందా? ఎవరూ భయపడొద్దు అన్నారు.
ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. మంగళవారం విడుదల చేసిన జాబితాలోనూ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. రాహుల్ గాంధీ 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో అమేథిలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే, మళ్లీ రాహుల్ పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది.
ఇక రాయ్బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ 2004 నుంచి సోనియా గాంధీ గెలుపొందుతూ వస్తున్నారు. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ రెండు స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్నాయి. ఈ రెండు స్థానాల్లో గాంధీ వారసులే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా యూపీలోని అమేథీ, రాయ్బరేలీ స్థానాలకు ఐదో దశలో మే 20న పోలింగ్ జరుగనున్నది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరుగనున్నది.