కాట్రా: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని కాట్రా పట్టణంలోగల మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రానికి అధికారులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ఉధంపూర్-రియాసి రేంజ్ డీఐజీ మహ్మద్ సులేమాన్ చౌదరి ఇవాళ పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
రియాసి జిల్లా ఎస్పీ అమిత్ గుప్తాతోపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కమాండెంట్, కాట్రా ఎస్పీ, కాట్రా ఎస్డీపీవో, ఆర్మీ అధికారులు, సీఐడీ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు, జిల్లాల స్పెషల్ బ్రాంచ్ల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాట్రా పట్టణంలోని హోటళ్లు, నివాసాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కాట్రా పట్టణానికి కొత్తగా వచ్చే వారిపై గట్టి నిఘా ఉంచాలని భద్రతా అధికారులకు డీఐజీ సూచించారు. నూతన సంవత్సరం నేపథ్యంలో రానున్న పది రోజులు, ముఖ్యంగా డిసెంబర్ 31న మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి అన్ని విభాగాల అధికారులు పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని డీఐజీ సులేమాన్ చౌదరి ఆదేశించారు.