న్యూఢిల్లీ: నిత్యం రగులుతున్న మణిపూర్ సంక్షోభం కారణంగా అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని కౌన్సిల్ ఆఫ్ ఇవాంజికల్ చర్చస్ ఇన్ ఇండియా (సీఈసీ ఇండియా) ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని, పౌరుల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని తమ సంస్థ కోరుకుంటున్నదని తెలిపింది.
మణిపూర్లో చోటు చేసుకుంటున్న విధ్వంసం, హింసను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సంస్థ చైర్మెన్ జే చిరంజీవి తెలిపారు. బాధితులకు అండగా ఉంటూ, వారికి అవసరమైన సహాయాన్ని చేయడానికి తామెప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు. హింసకు అడ్డుకట్ట వేసి మణిపూర్లో శాంతియుత పరిస్థితులు నెలకొనేలా అన్ని పార్టీలు, మానవ హక్కుల సంఘాలు చర్చలు జరపాలని ఆయన సూచించారు.