ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇవ్వాళ్టికి ఏడో రోజు. ఒక్కో కీలక పట్టణాన్ని చేజిక్కించుకుంటూ రష్యా సేనలు ముందుకు కదులుతున్నాయి. కేవలం ఆర్మీయే కాకుండా, పౌరుల స్థావరాలపై కూడా రష్యా సేనలు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకురావడాన్ని మరింత వేగవంతం చేసింది. పలువురు కేంద్ర మంత్రులను అక్కడికి పంపించి, భారతీయులను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చే బాధ్యతను అప్పజెప్పింది.
అటు కేంద్ర మంత్రులు విద్యార్థులకు ధైర్య వచనాలు చెబుతూనే వున్నారు. వీరికి తోడు.. ఆపరేషన్ గంగలో భాగంగా అక్కడి వెళ్లిన విమానాల పైలెట్లు కూడా విద్యార్థులకు ధైర్య వచనాలు చెబుతూ.. వారికి ధైర్యం నూరిపోస్తున్నారు. తాజాగా ఓ పైలట్.. విద్యార్థులకు ధైర్య వచనాలు చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ పైలట్ చెబుతున్న మాటలు విని.. విద్యార్థులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు.బుడాపేస్ట్ నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమాన పైలట్ ఒకరు విద్యార్థులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. టేకాఫ్ అయ్యే కంటే ముందు ఆ పైలట్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.
”మీ అందరికీ స్వాగతం. మీరందరూ సురక్షితంగా ఉండటం చూసి… నాకెంతో ఆనందమేస్తోంది. మీ ధైర్య సాహసాలను చూసి మాకు చాలా గర్వంగా ఉంది. అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా.. భయాన్ని జయించారు. నిర్భయంగా, అత్యంత సురక్షితంగా ఇక్కడికి చేరుకున్నారు. మనమందరమూ మన మాతృభూమికి చేరుకునే సమయం. మన మన ఇళ్లకు వెళ్లే సమయం. మనం ఢిల్లీకి చేరుకోడానికి సుమారుగా 9 గంటల సమయం పడుతుంది. మధ్యలో మనం జార్జియాలో ఇంధనం నింపుకుందాం. ఓ గంట దానికి పడుతుంది. మీరందరూ సుఖంగా.. నిశ్చితంగా కూర్చోండి. పూర్తి రిలాక్స్ అవ్వండి. కంటి నిండా నిద్ర పోండి. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయండి. మీ మీ కుటుంబీకులను కలుసుకోబోతున్నారు. అందుకు కూడా రెడీగా ఉండండి.” అంటూ ఆ పైలట్ విద్యార్థులనుద్దేశించి సంబోధించారు. దీంతో విద్యార్థులందరూ ముక్తకంఠంతో జై హింద్.. జైహింద్… భారత్ మాతాకీ జై.. భారత్ మాతాకీ జై.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చప్పట్లు కూడా కొట్టారు..
#WATCH "It's time to go back to our motherland, our home…," says the pilot of a special flight carrying Indians stranded in Ukraine from Budapest to Delhi pic.twitter.com/likhrimPSI
— ANI (@ANI) March 2, 2022