న్యూఢిల్లీ: పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ.. ఖాట్మాండులోని ఓ నైట్క్లబ్కు వెళ్లారు. అయితే ఆ క్లబ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయ్యింది. ఈ దేశంలో పెళ్లి వేడుకల్లో పాల్గొనడం ఇంకా నేరం కాదు అని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. మిత్ర దేశమైన నేపాల్కు రాహుల్ గాంధీ వెళ్లారని, జర్నలిస్టు ఫ్రెండ్ పెళ్లికి వెళ్లారని, మ్యారేజ్కు హాజర్వడం ఈ దేశంలో నేరం కాదని, కానీ పెళ్లికి హాజరవ్వడాన్ని కూడా బీజేపీ నేరంగా చూసే అవకాశాలు ఉన్నట్లు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. స్నేహితులు ఉండడాన్ని కూడా బీజేపీ నేరంగా పరిగణిస్తుందని ఆయన ఆరోపించారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఉందని, మరోవైపు రాహుల్ మాత్రం టూర్లు వేస్తున్నారని వీడియోను ఉద్దేశిస్తూ బీజేపీ ఆరోపించింది. పొలిటికల్ పార్టీల కన్నా.. పార్టీలకే ఎక్కువగా రాహుల్ హాజరవుతున్నాడని బీహార్ మంత్రి సయ్యిద్ షహనవాజ్ హుస్సేన్ అన్నారు. మేం రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంటే, రాహుల్ మాత్రం పబ్ పార్టీలకు అటెండ్ అవుతున్నారని విమర్శించారు. 2105లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు ప్రధాని మోదీ హాజరైన విషయాన్ని కాంగ్రెస్ నేత సుర్జేవాలా లేవనెత్తారు. ఆహ్వానం లేకున్నా మోదీ తరహాలో షరీఫ్ కేక్ కట్ చేసేందుకు రాహుల్ నేపాల్ వెళ్లలేదని సుర్జేవాలా అన్నారు. ప్రైవేటు ఫంక్షన్లకు ప్రతి ఒక్కరూ హాజరవుతారని, రాహుల్ హాజరవుతే తప్పేంటి అని ఎంపీ మనికమ్ ఠాగూర్ తెలిపారు.
రాహుల్ గాంధీ ఫుల్టైమ్ టూరిస్టు, పార్ట్ టైమ్ రాజకీయవేత్త అని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తాజా వీడియోను ఉద్దేశించి కామెంట్ చేశారు.