BBC | అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఇండియా కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో వరుసగా గురువారం మూడోరోజూ తనిఖీలు చేపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బీబీసీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
పన్ను ఎగవేతలు, ఆదాయ లాభాలను దారి మళ్లించడం లాంటి నేరాలకు బీబీసీ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ బీబీసీకి నోటిసులు ఇచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రధాని మోదీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
2002 గుజరాత్ అల్లర్ల ఘటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఏమిటన్నదానిపై విశ్లేషిస్తూ గత నెల బీబీసీ రెండు భాగాల డాక్యుమెంటరీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసినప్పటికీ, అనేక విశ్వవిద్యాయాల్లో ప్రదర్శించారు. ఢిల్లీలోని జేఎన్యూ, రాజస్థాన్లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఈ ప్రదర్శనలను అడ్డుకోవడం పెద్ద దుమారాన్నే రేపింది. దేశంలో బీబీసీని బ్యాన్ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు దాన్ని కొట్టేసింది. కాగా, బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.