India Railway | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) :రైల్వే ప్రయాణికుల భద్రతే ముఖ్యమని, దానికోసం ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్భాటంగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అశ్రద్ధ చూపింది. అంతేకాదు.. అందుకు కేటాయించిన నిధులను ఇతర అప్రాధాన్య పనులకు ఖర్చు పెట్టింది. ఇది ప్రతిపక్షాలు చేసిన ఆరోపణ కాదు. స్వయంగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) రిపోర్టు వెల్లడించింది. రైల్వే సేఫ్టీ ఫండ్ నిధులతో ఫుట్ మసాజర్స్, పింగాణీ పాత్రలు, శీతాకాలపు జాకెట్లు, తోటల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణం, ఎస్కలేటర్లు లాంటి ఆడంబర పనులకు ఖర్చు చేసినట్టు కాగ్ రిపోర్టు తప్పు పట్టింది.
సేఫ్టీ పనులకోసం కాకుండా అప్రాధాన్యమైన పనులకు ఖర్చు పెట్టింది. 2017 నుంచి 2019 వరకు 48నెలల మధ్య కాలంలో 4 నెలల్లో పెట్టిన ఖర్చును కాగ్ రాండమ్ ఆడిట్ రిపోర్టులో తప్పుబట్టింది. ఆ నాలుగు నెలల్లోనే సేఫ్టీ ఫండ్ లోని రూ.48.21 కోట్లు మార్గదర్శకాలకు విరుద్ధంగా దారిమళ్లించి ఇతర అవసరం లేని పనులకు ఖర్చు చేసినట్టు పేర్కొంది. 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైల్వే సేఫ్టీ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి ఉండగా బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ళ వ్యవధిలో ప్రతి ఏడాది రూ.20వేల కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లతో ప్రయాణికుల భద్రత కోసం సేఫ్టీ ఫండ్ ఏర్పాటు చేశారు. అందులో 15 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి , మిగిలిన 5 వేల కోట్లు రైల్వే నిధుల నుంచి వెచ్చించాలంటూ మార్గదర్శకాలు ప్రకటించింది. కాని బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. 1,14,907 కిలోమీటర్ల రైలు నెట్వర్క్ కలిగిన రైల్వే ప్రతిరోజు 2.4 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యానికి చేరుస్తుంది. 22,593 రైళ్ళు, 9141 గూడ్స్ రైళ్ళు నడుస్తున్నాయి. 1.14 లక్షల కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్లో ఏటా 4500 కిలోమీటర్ల ట్రాక్లను పునరుధ్ధరించాలని లక్ష్యంగా నిర్ధారించారు. కాని అది అమలులో నత్తనడకనే సాగుతోంది.
సేఫ్టీ పనులకు తగ్గిన నిధులు..
ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైల్వే సేఫ్టీ ఫండ్కు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఐదేండ్లలో లక్ష కోట్లు కేటాయించ లేదు. తన వంతుగా రైల్వే శాఖ కూడా ఏడాదికి 5 వేల కోట్ల చొప్పున 20 వేల కోట్లు కేటాయించలేదు. కేవలం రూ.4225 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. రైల్వే సేఫ్టీ ఫండ్ కింద 2017-18లో 81 శాతం నిధులు ఖర్చు చేయగా, 2019-20లో 73 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేశారు. ట్రాక్ పునరుద్ధరణ పనులకు 2018-19లో రూ. 9,607 కోట్లు కేటాయించగా, 2019-20లో రూ.7,417 కోట్లకు తగ్గించారు.
ఏటా పెరుగుతున్న అప్రాధాన్య ఖర్చులు…
మార్గదర్శకాలకు విరుద్ధంగా రైల్వే సేఫ్టీ ఫండ్ నుంచి అప్రాధాన్య పనులకు పెడుతున్న ఖర్చులు ప్రతి ఏటా పెరుగు తున్నాయని కాగ్ రిపోర్టులో పేర్కొంది. 2017-18లో 2.7 శాతం అప్రాధాన్య పనులకు ఖర్చు చేయగా, 2019-20లో 6.36 శాతానికి పెరిగాయని తప్పుపట్టింది.
రైలు ప్రమాదాలపై కాగ్ ఆందోళన
రైలు ప్రమాదాలపై కూడా కాగ్ తన ఆందోళన వెలిబుచ్చింది. 2017 నుంచి 2021 వరకు 2,017 రైలు ప్రమాదాలు జరుగగా,అందులో 1392 పట్టాలు తప్పడం వల్లనే జరిగినట్లు కాగ్ రిపోర్టులో పేర్కొంది. అయితే పట్టాలు తప్పడం, రైళ్ళు ఢీకొనే ప్రమాదాల నిష్పత్తి 80 శాతానికి పెరిగిందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది.
సిగ్నలింగ్ వ్యవస్థలకు ఇక రెండు తాళాలు
న్యూఢిల్లీ: ఒడిశా రైళ్ల ప్రమాదం నేపథ్యంలో సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతపై రైల్వే శాఖ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. రైలు నియంత్రణ వ్యవస్థ ఉండే రిలే రూమ్లు, లెవల్ క్రాసింగ్ల వద్ద సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ పరికరాలు ఉండే రిలై హట్లకు ఇక నుంచి రెండు తాళాలు వేయాలని అన్ని రైల్వే జోన్లకు రైల్వే శాఖ ఆదేశాలు పంపించింది.