ముంబై: మహారాష్ట్రలోని ఓ వ్యాపారి ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీమొత్తంలో నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటిని లెక్కించడానికే అధికారులకు 13 గంటల సమయం పట్టడం గమనార్హం. జాల్నా, ఔరంగాబాద్ పట్టణాల్లో ఉక్కు, వస్త్ర, రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించే వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఏకంగా రూ.58 కోట్ల నగదు, 38 కిలోల బంగారం, వజ్రాభరణాలు, ఆస్తులకు సంబంధించి ముఖ్యమైన దస్త్రాలు గుర్తించారు. మొత్తంగా రూ.390 కోట్ల విలువచేసే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
పన్ను ఎగవేత ఆరోపణలతో ఈ నెల 1 నుంచి 8 వరకు జాల్నా, ఔరంగాబాద్లోని వ్యాపారి ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఎనిమిది రోజులపాటు నిరాటంకంగా కొనసాగిన ఈ తనిఖీల్లో 260 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మొత్తం ఐదు బృందాలుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.