న్యూఢిల్లీ: తాజ్మహల్ చరిత్రకు సంబంధించిన నిజానిజాలపై విచారణను కోరడంతోపాటు, దాని పరిసరాల్లో 22 గదులను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ ఓ బీజేపీ నేత దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్)పై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఇది పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్లా లేదని, పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్లా ఉందని వ్యాఖ్యానించింది.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తోసిపుచ్చుతూ ఇప్పటికే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ ఎం ఎం సుంద్రేష్లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. పబ్లిసిటీ ఇంటరెస్ట్తో మాత్రమే దాఖలు చేసినట్లుగా ఉన్న ఈ పిటిషన్ను తోసిపుచ్చడంలో అలహాబాద్ హైకోర్టు తప్పిదమేమీ లేదని సుప్రీంకోర్టు కోర్టు పేర్కొన్నది.
బీజేపీ అయోధ్య యూనిట్ మీడియా ఇన్చార్జి రజినీష్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ పిటిషన్లో పిటిషనర్ రజినీస్ తన చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కుకు కలిగిన భంగం ఏమిటో తెలపడంలో విఫలమయ్యారంటూ కోర్టు దాన్ని తోసిపుచ్చింది.