శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో అమాయక పౌరులను ఉగ్రవాదులు చంపడంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆదివారం స్పందించారు. ఇది దురదృష్టకరమని ఆయన అన్నారు. కశ్మీరీ ప్రజల పరువు తీసే కుట్ర అని ఆరోపించారు. శనివారం ఉగ్రవాదులు మరో ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపి హత్య చేశారు. శ్రీనగర్, పుల్వామాలో ఈ ఘటనలు జరిగాయి. శ్రీనగర్ ఈద్గా ప్రాంతంలో పానీపూరీలు అమ్ముకునే బీహార్కు చెందిన చిరు వ్యాపారి అరవింద్ కుమార్ షాపై శనివారం సాయంత్రం 6.40 గంటలకు ఉగ్రవాదులు అతి దగ్గరగా తుపాకీతో కాల్పులు జరిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్కు చెందిన కార్పెంటర్ సాగిర్ అహ్మద్పై పుల్వామాలో ఉగ్రవాదులు కాల్పులు జరుపగా అతడు చనిపోయాడు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లో అదనపు భద్రతా దళాలను రప్పించి ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాగా, జమ్ముకశ్మీర్లో గత రెండు వారాల్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన పౌరుల సంఖ్య 9కి చేరింది.