న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన (PM-GKAY) కార్యక్రమాన్ని వచ్చే ఏడాది (2022) మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇవాళ ఢిల్లీలో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. క్యాబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా పేదల బతుకులు ఛిన్నాభిన్నం కావడంతో కేంద్రం గత ఏడాది PM-GKAY కార్యక్రమాన్ని ప్రకటించింది.
జాతీయ ఆహారభద్రత చట్టం కింద లబ్ధిదారులైన 80 కోట్ల మందికి ఈ కార్యక్రమం కింద చౌక ధరల దుకాణాల ద్వారా నెలకు 5 కిలోల చొప్పున ఉచితం బియ్యం అందిస్తున్నారు. ఈ నెల 30తో ఈ స్కీమ్ ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని మరో నాలుగు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయానికి కూడా క్యాబినెట్ ఆమోదం లభించిందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ శీతాకాలం సమావేశల్లోనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు ఆయన తెలిపారు.