ముంబై: స్వలింగ సంపర్కుల జంట పెట్టుకున్న అభ్యర్థనను ఆదాయపన్ను(Income Tax)శాఖ కొట్టిపారేసింది. వివాహ చట్టం ప్రకారం కానుకలపై ఇచ్చే ఆదాయపన్ను మినహాయింపును తమకు కూడా కల్పించాలని కోరుతూ ఓ స్వలింగ సంపర్కుల జంట బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 56(2)(ఎక్స్) కింద కలిగే బెనిఫిట్స్ తమకు కూడా ఇవ్వాలని కోరుతూ సేమ్ సెక్స్ జంట కోరింది. సంప్రదాయ దంపతులకు కల్పించే ఐటీ మినహాయింపు హక్కును తమకు కూడా కల్పించాలని కోరుతూ వేడుకున్నారు. పాయో అశిహో, వివేక్ దివాన్ అనే జంట ఈ పిటీషన్ వేసింది. వాళ్లు ఐటీ చట్టాన్ని సవాల్ చేశారు.
పెళ్లి కానుకలపై కొత్త జంటలకు కల్పించే ట్యాక్స్ మినహాయింపులను తమకు కల్పించాలని సేమ్ సెక్స్ జంట కోరింది.తమకు పన్ను మినహాయింపు ఇవ్వకపోవడం అనైతికమని స్వలింగ సంపర్కుల జంట వాదించింది. జస్టిస్ బీపీ కొలాబావాలా, జస్టిస్ ఫిర్దోష్ పూనివాలాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. స్వలింగ సంపర్కుల జంట పెట్టుకున్న అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ వ్యతిరేకించింది. పెళ్లి కానుకలపై జీవితభాగస్వాములు మినహాయింపు కోరడం చట్టం ప్రకారం వర్తిస్తుందని, కానీ పాయో, వివేక్లు దంపతులు కారు అని, వాళ్లు కేవలం స్వలింగ సంపర్క భాగస్వాములు మాత్రమే అని, వారికి ఆదాయపన్ను శాఖ చట్టాలు వర్తించవన్నారు.
ఆదాయ శాఖ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు సేమ్ సెక్స్ జంట ఆరోపించింది. Income tax department ద్వారా పన్ను మినహాయింపు పొంది, ఆ జంట పెళ్లి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐటీ శాఖ గత ఏడాది తన అఫిడవిట్లో ఆరోపించింది. ఆదాయపన్ను చట్టం ప్రకారం.. ఏ రిలేషన్షిప్ను కూడా పెళ్లిగా గుర్తించలేమని., భార్యాభర్తలు, దంపతులుగా నిర్దారించలేమని, స్వలింగ సంపర్కులు పెట్టుకున్న అభ్యర్థన టెక్నికల్ గ్రౌండ్పై చెల్లదు అని ఐటీ శాఖ చెప్పింది. ఈ కేసులో బాంబే హైకోర్టు బెంచ్.. ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ కేసులో ఐటీశాఖ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. జూలై 30వ తేదీన మళ్లీ ఈ కేసులో వాదనలు చేపట్టనున్నారు.