న్యూఢిల్లీ, జనవరి 5: దేశవ్యాప్తంగా ఇండియన్ స్టాండర్డ్ టైం (ఐఎస్టీ)ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. అంటే దేశ వ్యాప్తంగా మనకు ఒకే టైం అమలవుతుంది. ఇప్పటివరకు మనం ఐఎస్టీనే అనసరిస్తున్నా మన కంప్యూటర్లో ఒక టైం చూపిస్తే, మన సెల్ఫోన్లో మరో టైం కనబడుతుంది. కనీసం కొన్ని నిముషాలు గాని, సెకన్లు గాని తేడా ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో భారత ప్రామాణిక కాలంను కచ్చితంగా అమలు చేయాలనే నిబంధన ఏదీ లేదు. దీంతో కొన్ని చిక్కులు, ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఇక నుంచి ఐఎస్టీని కచ్చితంగా అమలు చేయాలనుకుంటున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐఎస్టీతో దేశంలోని అన్ని నెట్వర్క్లు, కంప్యూటర్లు ఒకేవిధంగా మనకు టైంను చూపుతాయి. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, పవర్ గ్రిడ్లు, బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజ్లు తదితరాలు ఐఎస్టీని అనుసరిస్తాయి. ఐఎస్టీని అమలు చేయడానికి నేషనల్ ఫిజికల్ ల్యాబరేటరీ (ఎన్పీఎల్), ఇస్రో సహకారంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఐఎస్టీ అమలు చేస్తే స్పేస్ నావిగేషన్, రేడియో టెలిస్కోప్, అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలలో కాలాన్ని నానోసెకన్ కూడా తేడా రాకుండా చూపుతుంది.