న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఆదిత్య ఎల్-1 మిషన్లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని ఇస్రో శుక్రవారం వెల్లడించింది. అతినీలలోహిత కిరణాల్ని వెలువరిస్తున్న సూర్యుడిని ఆదిత్య ఎల్-1లోని టెలిస్కోప్ (సూట్) ఫొటోలు తీసి, భూమిపైకి పంపింది.
200-400 నానోమీటర్ల తరంగధైర్ఘ్యంతో, అత్యంత తీక్షణశక్తిని కలిగి ఉండే ఈ కిరణాల్ని వెలువరిస్తున్న సూర్యుడి ఫొటోలు బయటకు రావటం ఇదే మొదటిసారి. అంతరిక్షంలో 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ (ఎల్ 1)ను ఆదిత్య ఎల్-1 వచ్చే ఏడాది జనవరిలో చేరుకుంటుందని ఇస్రో అంచనావేస్తున్నది. శాటిలైట్ అక్కడ్నుంచి సూర్యుడి గురించి పరిశోధన చేయనున్నది.