న్యూఢిల్లీ, ఆగస్టు 27: చంద్రుడిపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఇటీవల రికార్డు సృష్టించిన ఇస్రో.. తాజాగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టింది. అంతరిక్ష పరిశోధనలు చేసే ఇస్రో.. క్రికెటర్ రికార్డును బ్రేక్ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇస్రో రికార్డు క్రియేట్ చేసింది క్రికెట్లో కాదు.. సోషల్మీడియాలో. ఆగస్టు 23న విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన పోస్టును 56 మిలియన్ల మంది వీక్షించగా.. 8.46 లక్షల మంది లైక్ కొట్టారు. భారత్లో ఇదే అత్యధిక లైకులు కావడం విశేషం.
గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్పై సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించిన అనంతరం కోహ్లీ షేర్ చేసిన పోస్టును 7.96 లక్షల మంది లైక్ కొట్టారు. ఇప్పటి వరకు ఇదే రికార్డు కాగా.. ఇస్రో ధాటికి కోహ్లీ రికార్డు కొట్టుకుపోయింది. ఇస్రో కృషిని కొనియాడుతూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ట్విట్టర్లో లైకుల వర్షం కురిపించారు.