Mission Aditya | చంద్రయాన్-3 మిషన్ను విజయవంతంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సిద్ధమైంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు సమాయత్తమైంది. తాజాగా ఆదిత్య ఎల్-1 ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే నెల 2న ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఈ శాటిలైట్ను భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలోని ఎల్-1 పాయింట్ వద్దనున్న సుదీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఈ ప్రయోగానికి వేదికగా నిలవనున్నది.
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. సూర్యుడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు సమాయత్తమైంది. వచ్చే నెల 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 వ్యోమనౌకను సూర్యుడి చెంతకు ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ-57 రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపించనున్నది. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్ ఇదే. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలోని లాంగ్రేజ్ పాయింట్ (ఎల్-1) వద్దనున్న కక్ష్యలో ప్రవేశపెడుతారు.
ప్రయోగం ఇలా..
ఆదిత్య ఎల్1ను తొలుత లో-ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. అనంతరం ఆర్బిట్ను దీర్ఘ వృత్తాకారంగా మారుస్తారు. క్రమంగా శాటిలైట్ భూగురుత్వాకర్షణ పరిధిని దాటిపోతుంది. అనంతరం క్రూయిజ్ ఫేజ్ మొదలవుతుంది. తర్వాత ఎల్-1 పాయింట్ వద్దనున్న భారీ కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి ఎల్1 పాయింట్ చేరడానికి 4 నెలల సమయం పడుతుంది.