హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్హోల్) అధ్యయనమే లక్ష్యంగా పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులుచిమ్ముతూ రోదసీలోకి దూసుకెళ్లిన వాహకనౌక 21.5 నిమిషాల్లో నిర్ధేశిత కక్ష్యలోకి అత్యాధునిక ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు మరో పది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తున్నది.
ఖగోళ శాస్త్రంలో సరికొత్త చరిత్రకు ఇస్రో నాంది పలుకబోతున్నది. ఇది భారత్ తొలి పొలారిమెట్రీ మిషన్ కాగా.. ప్రపంచంలో రెండోది. ఇంతకు ముందు ఈ తరహా మిషన్ అమెరికా చేపట్టింది. సవాళ్లతో కూడుకున్న పల్సర్లు, బ్లాక్హోల్ ఎక్స్ రే బైనరీలు, యాక్టివ్ గెలాక్సీ న్యూక్లియోలు, న్యూట్రాన్ స్టార్స్, నాన్ థర్మల్ సూపర్ నోవా అవశేషాలతో సహా విశ్వంలో గుర్తించబడిన 50 ప్రకాశవంతమైన మూలాలను ఎక్స్పోశాట్ అధ్యయనం చేయనున్నది. ఈ ఉపగ్రహాన్ని 500-700 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార దిగువ భూ కక్ష్యలో ప్రవేశపెడుతారు. ఐదేండ్లపాటు సేవలందించనున్న ఎక్స్పోశాట్లో రెండు పేలోడ్స్ ఉన్నాయి. పాలీఎక్స్ (ఎక్స్-కిరణాలలో పొలారిమీటర్ పరికరం), ఎక్స్-రే స్పెక్ట్రోసోపీ, టైమింగ్ (ఎక్స్పెక్ట్-ఎక్స్స్పీఈసీటీ)ను అమర్చారు. పాలీఎక్స్ను రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేయగా, ఎక్స్పెక్ట్ను యూఆర్ రావు శాటిలైట్ సెంటర్కు చెందిన స్పేస్ ఆస్ట్రానమీ గ్రూప్ రూపొందించింది. ఖగోళ వస్తువులు, తోకచుకుల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని ఎక్స్పోశాట్ సేకరించనున్నది.
#WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh.
(Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ
— ANI (@ANI) January 1, 2024