న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరాఖండ్లోని జోషీమఠ్ పట్టణం కుంగిపోతున్నదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇచ్చిన నివేదిక వెబ్సైట్ నుంచి మాయమైంది. 12 రోజుల్లోనే జోషీమఠ్ 5.2 సెంటీమీటర్లు కుంగిపోయిందని ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్సీ) ఇచ్చిన నివేదిక శుక్రవారం ప్రభుత్వ వెబ్సైట్లో దర్శనమివ్వటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. జోషీమఠ్ హిందువులకు పవిత్ర ప్రాంతం కావటంతో మీడియా ఈ రిపోర్టుపై భారీగా కథనాలు ఇచ్చింది. దీని వల్ల ప్రజల్లో అలజడి రేగకుండా ఉండేందుకే వెబ్సైట్ నుంచి ఆ నివేదికను తొలగించినట్టు ఎన్ఆర్ఎస్సీ శనివారం తెలిపింది. ఎన్ఆర్ఎస్సీ అధికారులు శుక్రవారం అమిత్ షాతో నివేదికపై చర్చించారు. ఆ మరుసటి రోజే నివేదిక వెబ్సైట్ నుంచి మాయమైంది. జోషీమఠ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలాంగ్లో కూడా ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తల అధ్యయనం
జోషీమఠ్లో ఎన్జీఆర్ఐ బృందం అధ్యయనం మొదలుపెట్టింది. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ల సాయంతో భూఉపరితలంపై కలిగిన పగుళ్లను అంచనా వేసేందుకు పరిశోధన చేస్తున్నారు. తొలిరోజు జీపీఆర్ సాయంతో భూ గర్భంలోకి విద్యుదయస్కాంత తరంగాలను పంపి డాటా సేకరించింది.