న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అంతరిక్షంలోకి మానవుల్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గగన్యాన్ అంతరిక్ష నౌక ఫొటోలను శనివారం విడుదల చేసింది. ఈ మిషన్కు సంబంధించి మానవరహిత ఫ్లైట్ టెస్టులను ప్రారంభించనున్నట్టు తెలిపింది. క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరును ప్రదర్శించే తొలి ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబోర్ట్ మిషన్-1 (టీవీ-డీ1)ను పరీక్షలకు సిద్ధం చేస్తున్నట్టు ఇస్రో వివరించింది. అత్యవసర పరిస్థితుల్లో రాకెట్ నుంచి వ్యోమగాములతో కూడిన క్రూ మాడ్యూల్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడంలో క్రూ ఎస్కేప్ వ్యవస్థ సాయపడుతుందని పేర్కొంది.
గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా ఇద్దరు లేదంటే ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్తారు. మూడు రోజులు వారిని అక్కడే ఉంచి ఆ తర్వాత సురక్షితంగా వెనక్కి తీసుకొస్తారు. ఈ క్రమంలో వారిని భారత జలాల్లో సురక్షితంగా ల్యాండ్ చేస్తారు. టెస్ట్ ఫ్లైట్ విజయం తర్వాత మిగతా అర్హత పరీక్షలు, మానవరహిత పరీక్షలు నిర్వహిస్తారు.