2023 Year Ender | న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ అద్భుత విజయాలు సాధించి కొత్త ఏడాదికి సరికొత్త బాటలు వేసుకుంది. చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 మిషన్లను ఇస్రో విజయవంతంగా ప్రయోగించి భారత విజయపతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించింది. ఈ ఏడాది మనం సాధించిన విజయాలను ఓసారి చూద్దాం..
ప్రపంచదేశాలు ఇంతకుమునుపెన్నడూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి ఇస్రో ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రయాన్-3 మిషన్ ద్వారా విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై దించింది. అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం.. ప్రపంచ దేశాలను ఆశ్చర్యపోయేలా చేసింది. జాబిల్లిపై 14 రోజులపాటు విక్రమ్ పరిశోధనలు చేపట్టింది. చంద్రుడిపై ఆక్సిజన్తోపాటు ఇతర కీలక మూలకాల ఉనికిని గుర్తించింది.
సూర్యుడి రహస్యాలను కనుక్కొనేందుకు సెప్టెంబర్ 2న ఈ ప్రయోగం చేపట్టారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్1 పాయింట్ వద్ద ఉన్న కక్ష్యలో వ్యోమనౌకను ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుంచి ఇది భానుడిపై పరిశోధనలు సాగించనున్నది. వచ్చే జనవరి 6న ఇది తన గమ్యస్థానాన్ని చేరుకుంటుందని ఇస్రో ప్రకటించింది.
కృత్రిమ మేధ సాయంతో ఐఐఎస్సీ రూపొందించిన విధానం ఊపిరితిత్తుల క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తున్నది. ఐఐటీ జోధ్పూర్ సృష్టించిన ఏఐ ప్లాట్ఫామ్ మధుమేహ సంబంధ సమస్యల ప్రమాదాన్ని ముందుగానే నిరోధిస్తుంది. ఈ తరహా ఆవిష్కరణల వల్ల 2023లో 14.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ హెల్త్కేర్ మార్కెట్ 2028 నాటికి 102.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని నాస్కామ్ అంచనా వేసింది.
ఇవే కాకుండా అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారం కోసం భారత్ ఆర్టెమిస్ ఒప్పందంపై సంతకం చేసింది. దీని ద్వారా నాసా సాయంతో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు ఇస్రో భారత వ్యోమగామిని పంపనుంది. సౌర విద్యుత్తును అందుబాటు ధరల్లోకి తెచ్చేందుకు జాతీయ పునరుత్పాదక ఇంధన ప్రయోగశాల సోలార్ సెల్ టెక్నాలజీలో ప్రగతి సాధిస్తున్నది. మరోవైపు లిథియం-అయాన్ బ్యాటరీల జీవితకాలాన్ని, వేగంగా చార్జింగ్ అయ్యే అవకాశాలపై చెప్పుకోదగ్గ పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో భారత శాస్త్రవేత్తలు సాధించిన మైలురాళ్లు 2024లో సాధించే సృజనాత్మక ఆవిష్కరణలకు పునాది రాళ్లు కానున్నాయి.